Thursday, January 6, 2011

నేనొక సిటిజన్. మరి మీరు ? ( "సిటీ" జన్.. "C I T I " Z E N )

కొల్హాపూర్ కొచ్చిన కొత్తలో ఒకరోజు సిటీ చూడటానికి అని బయటకి వెళ్లాను. సిటీ మొత్తం తిరుగుతుండగా ఒక రోడ్డు నిర్మానుష్యం గా కనిపించింది .  ఇరు వైపులా షాప్ ల తో చూడటానికి చాలా బావుంది. ఆ రోడ్డు మద్య లో డివైడర్ లు లేవు. డివైడర్ లేని రోడ్డు లో వెళ్ళే వాళ్ళకీ వచ్చే వాళ్ళకీ ఇబ్బందిగానే ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.కానీ ఎవరూ లేని రోడ్డులో మన మొక్కల్లమే వెళ్ళేప్పుడు ఇక ఇబ్బంది ఏముంటుంది ?. రోడ్డు లో  ముందు ఎక్కడైనా వర్క్ జరుగుతుందేమో అనుకున్నాను. అలా అయితే  "రోడ్డు పని జరుగుతుంది. నెమ్మదిగా వెళ్ళండి" అనో , లేకుంటే"దారి మళ్ళించటమైనది" అనో బోర్డు ఉండేది, లేకుంటే కనీసం ఎర్రజెండా ఐనా వ్రేలాదతీసి "స్టాప్" అని బోర్డు పెట్టేవారు కదా! .. ఇలాంటి సూచనలు, సూచీలు  ఏమీ లేకపోవటం తో నేను రాబర్ట్ ఫ్రాస్ట్ లా ఫీల్ అయిపోయి ఎ రోడ్ నాట్ టేకెన్ అనుకుంటూ ఆ రోడ్డు తీసుకున్నాను. రోడ్డు చివరకు వెళ్ళాకా బండి కి  అడ్డం గా ఓ ట్రాఫిక్ కానిస్టేబులు పడిపోయి బండి కీ లాగేస్కున్నాడు . బండి సైడ్ లో పెట్టు . ఫైన్ కట్టు అంటూ నిలబడి ఉన్నాడు.


నేనెందుకు ఫైన్ కట్టాలో తెలుసు కోవచ్చా ? అని అడిగాను.


రాంగ్ రూట్ లో బైక్ డ్రైవ్ చేసినందుకు 100 రూపాయలు  ఫైన్ కట్టు అన్నాడు.
రోడ్డు లో లెఫ్ట్ సైడ్ నే కదా నేను వచ్చింది . అది రాంగ్ రూట్ ఎలా అవుతుంది అని నేను అడిగాను.
వన్ వే లో ఎదురుగా నువ్వు రైట్ సైడ్ వచ్చినా, లెఫ్ట్ సైడ్ వచ్చినా, అడ్డం గా వచ్చినా నిలువుగా వచ్చినా అది రాంగ్ రూట్  నే అవుతుంది అన్నాడు .

రోడ్డు పై ఎక్కడా రోడ్డు వన్ వే అని గాని ,దానికి సంభందించిన గుర్తులు గాని లేవు. అలాంటప్పుడు ఇది  వన్ వే అని ఎవరికైనా ఎలా తెలుస్తుంది. ఇది వన్ వే అని నాకు తెలియదు. అన్నాను .


నాతో అనవసరం గా ఆర్గ్యుమెంట్ చెయ్యకు, ఫైన్ కట్టి కీ తీస్కో అన్నాడు.


నాది తప్పే నేను ఒప్పుకుంటాను . వన్ వే అయినప్పడు బండి వన్ వే లోనే నడపాలి  , సెకండ్ వే లో నడపకూడదు .
నా తప్పుకు  ఫైన్ గా నేను మూల్యం చెల్లిస్తాను. మరి నీ తప్పుకు ఎంత మూల్యం చెల్లిస్తావ్ చెప్పు ? ఫైన్ లు దొబ్బటం తప్ప, ఎప్పుడైనా జనాల గురించి పట్టించుకున్నారా మీరు ?    అని అడిగాను ..


ఎక్కువగా మాట్లాడుతున్నావ్ నీకు పద్దతిగా ఉండదు. అంటూ కోపం గా నా మీదికి వచ్చాడు.
అది చూసిన  వేరే ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి, అతన్ని వెనక్కి తీసుకెళ్ళి అసలు జరిగిందేమిటి అని అడిగాడు.
వీడు రాంగ్ రూట్ లో వచ్చిందే కాకుండా , ఫైన్ కట్టమని అడిగితే తప్పంతా ట్రాఫిక్ పోలీసులదే అన్నట్టు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు . అని చెప్పాడు అతడు .

ఏరా పోలీసులదే తప్పన్నావట ? ఏంది రా తప్పు . చెప్పు అన్నాడు .


"ఫైన్ లు వసూలు  చెయ్యటానికైతే రూల్స్ , రూల్స్ అని మాట్లాడతారు .
ఇది వన్ వే ఐనప్పుడు , వన్ వే అని బోర్డ్ పెట్టాలి అని తెలీదు , కనీసం ఒక ఎర్ర గుడ్డ ముక్క కట్టటం కూడా తెలీదు. పొరపాటున వచ్చిన వాడికి ఫైన్ అయితే వెంటనే వేసేస్తారు. నా అదృష్టం బాగుంది ఇక్కడ రెడ్ లైట్ వెలిగి, ఎదురుగా ట్రాఫిక్ లేదు. ఏ మద్య లోనో ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ పడితే అప్పుడు నేనేం చెయ్యాలి ?, పక్కకు తప్పుకోవటానికి చిన్న పాటి ఖాళీ కూడా దొరకదు. ఒక వేళ ఏదైనా అనర్ధం జరిగి ఉంటే, పూర్తి భాద్యున్ని నేనే , ఎందుకంటే రాంగ్ రూట్ లో వచ్చాను కాబట్టి . అప్పుడు జరిగిన ప్రమాదానికి , పరిణామాలకి , మీ ప్రమేయం అసలు ఉండదు. అంతే కదా ? " అని నా కోపాన్ని అంతా వెళ్లగక్కేను.


ఇద్దరూ నాతో ఏమీ మాట్లాడలేదు, కాసేపు అలా మౌనం గా ఉండి పోయారు .
నేను ఇచ్చిన వంద రూపాయలు , బైక్ కీ తిరిగి ఇచ్చేసారు  . సర్లే నీ తప్పు లేదులే , వెళ్లి పో అన్నారు. " ఫైన్ లు వసూళ్లు చెయ్యటమే మా పని. అది సక్రమం గానే చేస్తున్నాం. కానీ ఈ రోడ్డు పక్కన బోర్డు లు వగైరాలు  ఏర్పాటు చెయ్యాల్సిన భాద్యత మున్సిపల్ కార్పోరేషన్ వాళ్ళది. వాళ్ళ పని వాళ్ళు చెయ్యలేదు . ఏది ఏమైనా సర్కారు వైఫల్యమే అని ప్రజలు  గా మీరు అంటారు "  అన్నాడు మొదటి వ్యక్తి .
    
ఫైన్ కడతాను , రిసిప్ట్ ఇవ్వండి అన్నాను.
ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు . వెళ్లిపో అన్నారు.


లేదు ఫైన్ కడతాను అన్నాను గా , ఫైన్ కడతాను రిసిప్ట్ ఇవ్వండి అన్నాను .
పొద్దు పొద్దున్నే ఓ  మొండిఘటం గాడు తగిలాడేంట్రాబాబు అనుకున్నట్టున్నారు . వంద తీసుకుని చలాన్ ఇచ్చాడు .


అలా కొంత దూరం వెళ్లి పార్కులో కాసేపు కూర్చుని , మళ్ళీ వెనక్కి వచ్చాను.
వన్ వే రెండు చివర్లా చెరో ఒకరు నిలబడి ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నారు వాళ్ళు . ట్రాఫిక్ పోలీసులుగా వాళ్ళ విధి వాళ్ళు సక్రమం గా నిర్వర్తిస్తున్నారు .


ఎదురుగా ఉన్న మున్సిపల్ కార్పోరేషన్ బిల్డింగ్ లోకి వెళ్లాను . "ఫిర్యాదుల పెట్టె . ." (" కంప్లైంట్ బాక్స్" ) అని దుమ్ము కొట్టుక పోయిన ఒక ఎర్ర రంగు డబ్బా కనిపించింది.


"ఉత్తర ప్రత్యుత్తర విభాగం " లో ఒక తెల్ల కాగితాన్ని అడిగి తీసుకున్నాను .


" నా నిర్లక్ష్యానికి మూల్యం గా ఈ ఫైన్ కట్టాను . మీ నిర్లక్షానికి మూల్యం గా ఒక ప్రమాదమో, ప్రాణం పోవటమో జరక్కుండా చూస్కోండి " అని రాసి , చలాన్ ను దానికి కింద పిన్ చేసి డబ్బాలో వెయ్యటానికి వెళ్లాను .


అప్పడే ఆ డబ్బాను ఓపెన్ చేసి ఉత్తరాలు పట్టుకెల్తున్న వ్యక్తి కనిపించాడు.
మీరు రోజూ ఈ ఉత్తరాలు తీసుకెల్తారా ? అని అతన్ని అడిగాను.


"రెండ్రోజులకోసారి తీస్తూ ఉంటాను . వారానికో , రెండు వారాలకో ఓక్కో ఉత్తరం వస్తుంది బాబు  "అన్నాడు ఆ తాత.


నేనూ ఒక ఉత్తరం వేద్దామని వచ్చాను .
అయితే అంతలా ఆ పెట్టె దుమ్ముకొట్టుకు పోవటం చూసి వేసినా ప్రయోజం ఉండదేమో అనుకున్నాను అన్నాను.
తాత వెంటనే పెట్టెను శుభ్రం చేసి , దుమ్ము దులిపాడు . ఇప్పుడు ఉత్తరాలు వస్తాయా బాబు ?  అని అడిగాడు .


తప్పకుండా వస్తాయ్ . ! వారానికి ఒకటైనా , కనీసం నేనైనా వేస్తాను అన్నాను.


సమస్య తీరాకా వ్యక్తి పొందే సంతోషం అంతా అతని కళ్ళలోనే కనిపిస్తుంది .


సంతోషం బాబు . నీ ఉత్తరమిటియ్యి , పెదసారు వెంటనే తీసుకురమన్నారు ..అని నా చేతి లో ఉన్న ఉత్తరాన్ని చాలా భద్రం గా తీసుకెళ్ళాడు .




తర్వాతి వారం నా ఉత్తరం దాని పై నే వెయ్యాల్సి వస్తుందేమో , రిమైండర్ 1 , 2 ,3 .. ఇలా ఉత్తరాలు వెయ్యాల్సి వస్తుందేమో అనుకున్నాను .


అలా జరగలేదు , స్టాప్ అని , వన్ వే అని నాకు రెండు బోర్డులు కనిపించాయి .

ట్రాఫిక్ వాళ్ళు " వన్ వే , డోంట్ గో ఏ హెడ్ " అని రోడ్డుకి ఆ చివర బోర్డు పెట్టించినట్లున్నారు.    
         
ఆ బోర్డు చూస్తే నాకెందుకో పట్టలేని సంతోషం వచ్చింది .
ఆ బోర్డునే చూస్తూ రోడ్డుకి పక్కగానే నిలబడి ఉన్నాను .


ఏం జరిగిందో ఒక్క క్షణం అర్ధం కాలేదు. నిలబడ్డ నేను నేలకొరిగాను. అరచేయి సన్నగా కొట్టుక పోయింది. పట్టలేనంత కోపం వచ్చింది. వేరే ఎవరైనా కారు నడిపి ఉంటే నాకొచ్చిన ఆవేశానికి ఏం చేసేవాడినో  ?


నాకేదో జరిగిందేమో ? అన్నా అనుమానం తో సన్నగా కంపిస్తూ ఓ వృద్దుడు నన్నే చూస్తున్నాడు.
పదిహేను  పదహారేళ్ళు కూడా ఉందని ఇద్దరు అబ్బాయిలు ఒక బైకుతో అతని కారుకి అడ్డంపడ్డారు.వాళ్ళని  తప్పించక  పోయి , కారుని  కంట్రోల్  చెయ్యలేక రోడ్డు చివరన ఉన్న నన్నుడీ కొట్టాడు  .

"నీకేం కాలేదు కదా అమ్మా ? "అని, అతను నన్ను  అడిగాడు.
అతని మాటలకు నాలో  కోపం చచ్చిపోయిందేమో  ?. 

" ఏమన్నా జరిగి ఉంటే ఏం చేసేవారు  ? ఒక వేళ పెద్ద  ప్రమాదమే  జరిగితే  , లైఫ్ లాంగ్ నేను  బాధ  పడాలి ," రోజు  అలా అసలు వెళ్ళాల్సిందే  కాదు , అనవసరం గా ఒకర్ని బాధ పెట్టాను అని మీ మిగిలిన లైఫ్  అంతా కుమిలిపోతూ మీరు బతకాలి. 
 కంట్రోల్ చెయ్యలేక  నన్ను  డీ  కొట్టారు  , ఒక వేళ  వేరే వెహికల్  నైనా   డీ కొట్టి  ఉంటే , ఏం జరిగి ఉండేది ?" ఇదంతా అవసరం అంటారా ?

పెద్దా , చిన్నా లేకుండా నేను మాట్లాడుతున్నాను  అనుకోవద్దు . 
పెద్ద  ఐనా చిన్న ఐనా నేను ఏదైనా విషయం  లో వాళ్ళ  వల్ల  నొచ్చుకుంటే  తప్పకుండా స్పందిస్తాను  , మాట్లాడతాను  .
అది నా నైజం.

నాకేం 
కాలేదు గా మీరు జాగ్రత్త గా వెళ్లి రండి అన్నాను .

అతను వెళ్లి పోయాడు.నేనూ వచ్చేసాను.
కానీ ఇప్పటికీ నా ఆలోచనలు  అక్కడినుంచి రావట్లేదు. 
ఒకటే ప్రశ్ననన్ను వేధిస్తుంది. " తప్పు ఎవరిది ? "  అని . 

వయసు లేకున్నా , వయస్సు  దాటి  పోయినా  రోడ్ల  పై వాహనాలు  నడుపుతున్న  వాళ్లదా  ?
అలాంటి  వాళ్లకు  కూడా లైసెన్సులు   జారీ  చేస్తున్న సర్కారుదా?

మనసులోనే ఖండించుకుంటూ ...
చేతకాని  వ్యవస్థని  , మార్చటం  చేతకాక  , చేతకాని  వాళ్ళలా  మౌనం గా రోదించే నా లాంటి   నా ప్రజలదా ? 

ఎవరిది ?
తప్పెవరిది ?

ఇక మారదా వ్యవస్థ ? మార్చలేమా మనం ? అసలు మార్చే వాళ్ళే లేరా ? ఎలా మార్చగలం ?..


ఒకటే  ప్రశ్న మిగిలింది అనుకున్నాను .. చాలా ప్రశ్నలు వస్తున్నాయి .. నాకైతే ఇవి జవాబు దొరకని చిక్కు ప్రశ్నల్లా అనిపిస్తున్నాయి.


తల నొప్పి మొదలవుతున్నట్లుంది. ఒక స్ట్రాంగ్ చాయ్ పడితే గాని సర్దుకోదు.
లేకుంటే రాత్రికి నిదుర కూడా రాదు .


నేను అసలు ప్రస్తుతం ఏం చెయ్యాలి ? 
సమాధానాలు వెతకటం మాని చాయ్ తాగాలి . 
ఎలాగూ నా గోడు బ్లాగు లో వెల్లగక్కేను కాబట్టి ఎవరో ఒకరు సమాధానం చెప్పక పోరు .


హమ్మయ్య !,  గోడు విన్నవించు కోవటంతో నా మనసు కుదుట పడింది . 
నోట్లో చాయ్ పడనే లేదు., తలనొప్పి తగ్గనే లేదు .. 
నిదుర మాత్రం ముంచుకొచ్చింది . ప్రశాంతం గా పడుకున్నాను  . 
నిద్ర లేవగానే మళ్ళీ బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమస్య ల గురించి , సమాధానాల గురించి మళ్ళీ ఖాళీ దొరికినప్పుడో , 
నాకు మళ్ళీ కష్టం కలిగినప్పుడో , ఏ పది రోజులకు ఒక్కసారో  ఆలోచిస్తాను. ప్రభుత్వాలు చేతకానివని, సర్కారు సరైనది కాదు అని మళ్ళీ విరుచుకు పడతాను ..

నేను మారనంత వరకూ నా వాళ్ళు మారరు. 
నేను నా వాళ్ళు , మీరు  మీ వాళ్ళు , మనం మనవాళ్ళు  అంతా కలిస్తేనే సమాజం ( వ్యవస్థ ).
మనం మారనంత వరకూ వ్యవస్థ మారదు.  మార్చలేము మనం . మార్చే వాళ్ళే ఉండరు .

నా , నా  అంటూ నా కోసం మాత్రమే ఆలోచించుకునే నా లాంటి వాళ్ళు ఉన్నంతకాలం వ్యవస్థ మారదు.
అందుకే నేను మారతాను . నా కోసం కాదు. నా వాళ్ళ కోసం . ( ఇందులోనూ నా సెల్ఫిష్ నెస్ ఉంది ).
నా కోసం కాకున్నా నా సెల్ఫిష్ నెస్ కోసం అన్నా నేను మారతాను .
నేను ఎదుర్కొన్న సమశ్యలు నా వాళ్ళు ఎదుర్కోకుండా జాగ్రత్త పడతాను . కనీసం ప్రయత్నిస్తాను . 
ఎందుకంటే నేనొక  సిటిజన్.



  

Thursday, December 30, 2010

రైతు బతికినా ,చచ్చినా ఒకటే కదా ? ( R E A C T I O N )

ఒక బ్లాగర్ గా నేను స్పందించట్లేదు .
ఒక సామాన్యుడి గా నా స్పందనని తెలియచేస్తున్నాను ..
పచ్చి గా మాట్లాడ్డం రాక నిఖ్ఖచ్చిగా నిజం రాస్తున్నాను.
ఒక రైతు బిడ్డగా కడుపుమండి  రాస్తున్నాను.
రైతుల బతుకులు మీరు వక్రీకరించినంత హీనం గా లేవు అని చెప్పడం కోసమే రాస్తున్నాను !




మీ టపా చూసిన తర్వాత
"ఏనాడైనా రైతుని మీరు ఒక మనిషి గా చూసారా?  లేదా ?  అనే సందేహం కలుగుతుంది "

అని మీరు హెడ్డింకు పెడితే రైతులకోసం ఎవరో పాపం గొంతు చించుకుంటున్నాడు.నేనే రైతు భాంధవుడిని అని కళ్ళ బొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడేమో అనుకున్నాను .
కానీ ఇంత నిజాయితీ గా , నిఖ్ఖచ్చిగా , నిష్పక్షపాతం గా , ఎంతో విషయ పరిజ్ఞానం తో 
కళ్ళు చెదిరిపోయే ఇలాంటి ఒక గొప్ప వర్ణనాతీతమైన టపా ఒకటి ఉంటుంది అనుకోలేదు.


"వర్షాలు పడలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని దించేసారు. వర్షాలు పడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగమంటున్నారు. అసలు మీకేమి కావాలి? వర్షం కావాలా? ప్రభుత్వం దిగిపోవడం కావాలా? ప్రకృతి ప్రభుత్వం చేతిలో ఉందా?"

ఆహా !, ఎంత సూటి ప్రశ్న మేడం .,

వర్షాలు పడట్లేదని  చంద్రబాబు  ప్రభుత్వం  కూలిపోయిందా ?
వర్షాలు పడుతున్నాయని  కాంగ్రెస్  ప్రభుత్వాన్నిదిగమంటున్నారా ?

నేనేమో అధికారంలో ఉన్నంతకాలం  వ్యవసాయం దండగ  అని  చెప్పి, నేల  వీడి  సాము  చేసినందుకు  బాబు  గారి  ప్రభుత్వం  కూలిపోయింది అనుకున్నాను .


అమ్మా  ప్రకృతి  ప్రభుత్వం   చేతిలో  ఉండదు  . కానీ  ఏదైనా  రాష్ట్రానికి   సంబందించి    నదీ  జలాలు  , సహజ  వనరులు  ఆ  రాష్ట్ర  ప్రభుత్వం  చేతిలోనే  కదా  ఉండేది  ? ( లోక  జ్ఞానం  , విషయ  పరిజ్ఞానం  రెండూ  లేనివాడిని  , ఈ  మాత్రం  కూడా  తెలీదా  అని  నవ్వుకోవద్దు  సుమండీ  )  

సరిపడినంత   వర్షాలు  పడినా  , జీవ  నది  ( గోదావరి  ) పక్కనే  జీవచ్చవం   లా  పడి  ఉంటుందని   ఏనాడూ  ఎవరూ  ఊహించరు  .

మా  ప్రజా  ప్రతినిధులని  , మమ్మల్ని  ఏదో  ఉద్దరించేస్తారని  ఓటు   వేసి  ఎన్నుకున్న  పాపానికి , నదీ  జలాల్ని  సక్రమం  గా  వినియోగించటం  రాని  ఓ  చేతకాని  ప్రభుత్వం  గా  కాంగ్రెస్  మిగిలి  పోయినందుకు  , చరిత్రలో  ఎప్పటికీ  మాయని  మచ్చ గా  మాకు  కరువుని  మిగిల్చినందుకు  ,

పావలా  వడ్డీ  కే  ఋణాలు ,
ఉచిత   కరెంటు లు ,
జల  యజ్ఞాలు  అని  కళ్ళ  బొల్లి  కబుర్లతో  నమ్మబలికి  , అభివృద్ది  పధకాలు  అనే   పదానికే  అర్ధం  తెలియనంతగా  వ్యవహరిస్తున్నందుకు  గానూ  ఈ  ప్రభుత్వానికి  ఈ మద్య   సంక్షోభం  వచ్చింది  అని  నేను  అనుకుంటున్నాను  .

ప్రభుత్వాలు  కూలి  పోవటానికి  ప్రభుత్వాల  చేతకానితనం    కాదామ్మా   కారణం  ?
 “వర్షాలు  – ప్రకృతి  “ నా  ?

వర్షం వచ్చినా ప్రభుత్వం తప్పే, వర్షం రాకపోయినా ప్రభుత్వం తప్పే, మరి మీరు ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతుకుతున్నారాప్రభుత్వానికి చెప్పి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ప్రభుత్వానికి చెప్పి మీరు గంపెడు సంతానాన్ని కంటున్నారా? ప్రభుత్వానికి చెప్పి మీరు తాగుతున్నారా? ప్రభుత్వానికి చెప్పి మీరు శక్తికి మించి అప్పులు చేసి మీ పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారా? ఏవరిది తప్పు? మీరు జల్సాలు చేయడానికి అప్పులు చేసి, పంట నష్ట పోయామని సాయం చేయమని అంటారా? వ్యవసాయమంటే నే వర్షాధారమని తెలియదా? వాన రాకడ...ప్రాణం పోకడ మన చేతిలో లేవని తెలియదా? అన్నింటికీ ప్రభుత్వానిదే తప్పు అయితే మీరు బ్రతికి ఉండి ప్రయోజనమేముంది?


అమ్మా  మేడం,,   
చాలా  మంది  రైతుల్లో  ప్రభుత్వానికి  సెప్పి  పెళ్ళిళ్ళు  సేసుకోవాలి  అని  తెలియని  నిశానోల్లు  ఉన్నారమ్మా  !.. వాళ్ళ  వరకూ  ఏంటి  మూడో  తరగతి   సదువుకున్న  నాకే  తెలియదు ?  ,

భారత  దేశ  జనాభా  నూట  పది  కోట్ల  కి  చేరుకోవటానికి  కారణం  కేవలం  సదువుకోని   రైతే  కదమ్మా   ?


మీలాంటి  గోప్పోల్లకైతే  _________ పద్దతులన్నీ తెలుసు .,
పాపం  గంపెడు  సంతానాన్ని  కనే ఊరోల్లకేమి  తెలుసమ్మా ?
గంపెడు  పిల్లల్ని  కంటున్నారు  అని  బాధ  పడేకంటే  కొంచెం  పెద్దమనసు  సేస్కుని  ఆ  పద్దతులేమో  ఊరోల్లకు   సెప్పరాదూ  ?


ప్రభుత్వానికి చెప్పి మీరు తాగుతున్నారా? ప్రభుత్వానికి చెప్పి మీరు శక్తికి మించి అప్పులు చేసి మీ పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారా? ఏవరిది తప్పు? మీరు జల్సాలు చేయడానికి అప్పులు చేసి, పంట నష్ట పోయామని సాయం చేయమని అంటారా?

అసలు  ఏందండీ  మీ  ఉదేశ్యం ఇక్కడ  ?

“తాగుబోతులు  , పిల్లల  పెళ్ళిళ్ళు  ఘనం  గా  చెయ్యాలని  ఆశపడే  వాళ్ళు   ( అందులోనూ  అప్పులు  చేసి  పెళ్ళిళ్ళు  చేసే  టోల్లు  ), జల్సాలు  చెయ్యటానికి  అప్పులు  చేసెటోల్లు  అందరూ  రైతులే  .కేవలం  రైతులే . రైతులు  తప్ప  వేరే  వాళ్ళెవరూ  ఇలాంటి  పనులు చెయ్యరు  , రైతులంతా  ఇదే  పని  చేస్తారు  “ అనా    ? 
 

ఓ  పెద  రైతు ,  కొడుకుని సదివించు కోవాలి   అని కోరుకోవటం , పిల్లలకి   పెళ్ళిళ్ళు  కొంచెం  ఘనం  గా సెయ్యాలనుకోవటం తప్పే కదండీ.

జల్సాలు  సెయ్యటానికి   అప్పులు  సేసి  , పంట నష్టపోయాం  సాయం  సెయ్యమని  అడుగుతున్నారా ?
ఏందమ్మా  ... ?


 
మీరు బ్రతికి ఉండి ప్రయోజనమేముంది?

రైతు  బతికి  ఉండి  ప్రయోజనం  ఏముంది  ?
శభాష్  అండి మేడం గారూ .. 
ఇంకా  ఎవరూ  ఈ  ప్రశ్న  అడగట్లేదు  ఏంటా  అని  నేను  అనుకుంటున్నాను  .

నిజమే  ఏదో  ఒకటి  సాధించే  వాళ్ళే  బతకాలి ,
పొట్ట కూటికి  కష్టపడేటోల్లు   ,
చదునుచేసి ,దుక్కిదున్ని ,నారుపోసి ,నీరుపెట్టి ,పంటచేసి,పంటకోసి ,కుప్పనూర్చి  ఆకలితీర్చుకునేటోల్లు  అసలు  రైతులెందుకు  బతకాలి?
ఏం సాధించారు అని బతకాలి .వాళ్ళు  లేకున్నా  మనలాటోల్లం ఎంచక్కా భోజనం కొనుక్కోగలం కదా !  

వ్యవసాయం చేసేవాడెపుడూ రెండు గేదెలను తప్పక పెంచుకోవాలి. రెండు గేదెల వల్ల వారికి రోజు వారీ ఖర్చులు  గడచిపోతాయి. సంవత్సరానికి వచ్చే పంట వారికి తదుపరి పెట్టుబడి మరియు ఇతరత్రా నిల్వ ఉంచుకుని వారు ఏదైనా వస్తువులు కొనుక్కుని వాడుకోవడం కానీ దాచుకోవడం గాని చేయాలి. ఇది పద్ధతి. ఇలా చేసే వ్యవసాయదారుడెపుడూ నష్టపోడు. ఒక సంవత్సరం నష్టపోయినా తర్వాతి పంటలో మిగుల్చుకుంటాడు. వర్షం లేనపుడు పూడిక తీసుకోవాలి, వర్షం వచ్చినపుడు గండ్లు తీసుకోవాలి.


అవునా  మేడం ?  “ పద్దతి  “ గురించి  చెప్పటానికా  అమ్మా  మీరు  ఇంత  కష్టపడింది .

ఆలోచిస్తే "ఆయనే  ఉంటే  తెల్ల చీరెందుకు  ? " అన్న  చందాన  ఉందమ్మా  మీరు చెప్పిన విషయం .

పొలాల్లో  కలుపు  తియ్యటానికి  పెళ్ళాల  పుస్తెలు  తాకట్టు పెట్టే  చిన్న  రైతులు ,
పంట  పండినా  పండక పోయినా  బస్తాల  కొద్దీ  శిస్తు  చెల్లించుకునే  కౌలు  రైతులు ,
వీళ్ళా  అమ్మా  “బర్రెలు  కొనుక్కుని  ఇంటిని  గడుపుకునేది  “ ?


వర్షం లేనపుడు పూడిక తీసుకోవాలి, వర్షం వచ్చినపుడు గండ్లు తీసుకోవాలి.
వావ్ ..   వాట్  ఏ   లాజిక్  మేడం   !.
ఈ  లాజిక్  చెప్పే  వాళ్ళు  లేకే  ఇన్నాళ్లుగా  మా  రైతుల  బతుకులు  ఇలా  ఉన్నాయి  .

పంట  సగంలో  ఉన్నప్పుడు  అతివృష్టో , అనావృష్టో వస్తే  అప్పుడు  కూడా  మీ  వాదనే  సరి  అయినదా  ?
 అనావృష్టితో  పంటలు  ఎండి పోయినప్పుడు  , అతివృష్టితో  పంటలు మునిగి పోయినప్పుడు రైతులు  ఏం  చెయ్యాలి ? అది కూడా చెప్పి పుణ్యం కట్టుకోమ్మా !

 
మీరిలాగే నష్టం నష్టం అని మొరిగారంటే ఇంతవరకు రిలయన్స్ కన్ను, కార్పొరేట్ వారి కన్ను వ్యవసాయం మీద పడలేదు. ఇపుడు వాళ్ళు మిమ్మల్ని తోసేసి వాళ్ళే వ్యవసాయం మొదలుపెట్టేస్తారు. అపుడు మీ పొలంలో మీరే కూలీలుగా పనిచేయవలసి ఉంటుంది. ఏదీ అతిగా చేయకూడదు. ఉచిత విద్యుత్తు, ఉచిత ఎరువులు, ఉచిత మద్యం, ఉచిత బియ్యం ఇలా ఎన్ని ఉచితాలు కావాలి? ఇన్ని ఉచితాలు తీసుకుని మీ బ్రతుకులు మారుతున్నాయా? ఎక్కడి వేసిన గొంగళి  అక్కడే అన్నట్లు మీరు అలాగే ఉంటున్నారు. పేరుకి మీకు ఇస్తున్నట్లు రికార్డులు... అసలు మీ దాకా వస్తున్నాయా? మీ పేరు చెప్పుకుని దళారులు బాగుపడుతున్నారు. ప్రభుత్వం పైనుండి రూపాయి పంపితే మీకు దక్కేది 10 పైసలు మిగతాది ఎక్కడికి పోతుంది? మీ నేతల జేబుల్లోకి వెళుతుంది. మీ పేరు చెప్పుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. నిరాహారదీక్షలు , మహా గర్జనలూ వాళ్ళ కడుపులు నింపు కోడానికే గానీ మీ కడుపులు నింపడానికి కాదు. ఉచితాలను కోరుకోకండి. ఊరికే ఏదీ రాదు, ఊరికే వచ్చింది మీ దగ్గర నిలవదు.”

ఈ  పేరా  చదివాకా  మీతో  ఏం  చెప్పాలో  తెలియట్లేదు  మేడం  . ఎందుకంటే నచ్చీ నచ్చకుండా ఉంది.


మొరిగారంటే  .. ?

మీ  కంటికి  ఇప్పటి  వరకూ  రైతు  మనిషిలా  మాత్రమే  కనపడట్లేదు  అనుకున్నాను  . ఇంత  అద్భుతం  గా  కనిపిస్తాడని ,
చెయ్యి  తిరిగిన  రచయితలు  కూడా  మీలా  ఇంత  గొప్పగా  మా రైతుల్ని వర్ణించలేరని ఒప్పుకుంటున్నాను . కనీసం  మేము  మీకు  అలా  అయినా  కనిపిస్తున్నాం , సంతోషం  తల్లీ .


ఇంతవరకు రిలయన్స్ కన్ను, కార్పొరేట్ వారి కన్ను వ్యవసాయం మీద పడలేదు. ఇపుడు వాళ్ళు మిమ్మల్ని తోసేసి వాళ్ళే వ్యవసాయం మొదలుపెట్టేస్తారు. అపుడు మీ పొలంలో మీరే కూలీలుగా పనిచేయవలసి ఉంటుంది.

చిత్తం  తల్లీ  , అలాగేనమ్మా తప్పకుండా  అలాగే  చేద్దురు గాని .
మీరు వత్తాసు పలుకుతున్న  ఈ  ప్రభుత్వాలు  సెజ్  ల  పేరుతో  ఇప్పటివరకూ  చేసింది  అదేకదమ్మా !

మా  పొలాల్లో  పని  చేసుకునే  వెసులుబాటు  మాకు  కల్పిస్తారా  ?
కూలీ  సేస్కుని  నోట్లోకి  నాలుగు  మెతుకులు పెట్టుకునే  అదృష్టం  మాకు  ఉంటుందా  అమ్మా  ? 

ఉచితాలు  ఇస్తున్నాం  అని  చెప్పుకునేది   సర్కారోల్లు .
ఆ ఉచితాలు  కోరుకునేది  దళారోల్లు  . ఆ  విషయం  అయినా  ఒప్పుకున్నారు  సంతోషం  .
లేకుంటే  మీ  సర్కారు  విదిల్చిన  గింజలు తిని  మా  రైతులు  బతుకుతున్నారని  అన్నా  అందురు  .   


దొడ్లో నాలుగు తోటకూర గింజలేస్తే నాలుగే రోజుల్లో తోటకూర మొలుస్తుంది. నాలుగు కోళ్ళు పెంచితే  నాలుగు గుడ్లు పెడతాయి, బస్తా బియ్యం , జాడీడు ఆవకాయ తో, కమ్మటి పెరుగు తో సంవత్సరమంతా హాయిగా గడిపేయవచ్చు.

సొల్యూషన్ మాత్రం  బాగా  చెప్పారండి  మీరు  .

  • దళారుల  చేతి  లో  దారుణం  గా  దగా  పడినప్పుడు   ,
  • చేతికొచ్చిన  పంట  వరద  లో  కొట్టుకు  పోయినప్పుడు ,
  • పెళ్లీడు  కొచ్చిన  ఆడపిల్ల  గుమ్మం  లోనే  తిరుగుతూ  ఉన్నప్పుడు , "కనీసం  కన్న  కూతురి  పెళ్లి  చెయ్యలేనోడివి  ఆ  పిల్లనెందుకు  కన్నావ్ ?" అని  మనస్సాక్షి  ప్రశ్నిస్తున్నప్పుడు  ?
  • సడువుకుని  ప్రయోజకుడవుతాడు  అనుకున్న  కొడుకు  తనతో  పాటే  ఎండనకా ,వాననకా కష్ట  పడుతున్నప్పుడు  , రాళ్ళుకొట్టి,మట్టిమోసి  కందిపోయిన  సేతులతో  అన్నం  కలుపుకోవటానికే  కష్టపడుతున్నప్పుడు .
  • స్కూల్లో  బాగా  చదువుకునే  కుర్రాడమ్మా   , పాపం  ఈడికి  ఈ  గతి  పట్టింది  అని  తన  కొడుకుని  చూసి  జనం జాలి  పడుతున్నప్పుడు  ?
  • “ఏమ్రా  రైతు ? , అప్పు  తీస్కుంటివి. అసలు  , మిత్తి  రెండూ  కట్టాలని  తెలియదేంట్రా ?వర్షాలు  పడక  పోయినా , పంటలు  పండక  పోయినా  , పంట వరదలో కొట్టుక  పోయినా  దానికి  నేనా  భాద్యున్ని  ?నీకు  రెండ్రోజుల  గడువు  ఇస్తున్నా  , ఈలోపు  మిత్తి గా  నీ  పెళ్ళాం  తాళిబొట్టు  నా  కాడ  తనఖా  పెట్టుకుంటా , మొత్తం  డబ్బులు  ఇచ్చి విడిపించుకో ” అని  అప్పులోల్లు  ఇంటి  మీద  పడితే  అప్పుడు  .

మీరు చెప్పిన కమ్మటి పెరుగే గొంతు దిగదు.

ఆ  సందర్భాల్లో  రైతన్న  కట్టుకున్నపెళ్ళానికి  , కన్నబిడ్డలకి  కోరుకున్న బతుకునీయలేక పోయినా  అనీ ,
అయినోల్లకేమీ  సెయ్యలేక  పోయినా  అనీ బాధ  పడతాడు  తప్ప , దేశాన్ని  ఉద్దరిద్దాం  అని  కాదు  .



 
చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తే చస్తారు, కె సి ఆర్ నిరాహార దీక్ష చేస్తే చస్తారు, వై ఎస్ ఆర్ చనిపోతే చస్తారు, వాళ్ళు చస్తే వాళ్ళ భార్యలు చావడం లేదు, వాళ్ళ కొడుకులు చావడం లేదు మీరెందుకురా చావడం ?”

ఈ  లైన్స్  నాకు  చాలా  బాగా  నచ్చాయి  .
అయితే  మీరు  రైతులకోసం  చెప్పేటప్పుడు  , ఈ సందర్భం  లో  చెప్పడమే  అంతగా  రుచించలేదు  .
బహుశా ఇవి మీరు రైతులని ఉద్దేశించి రాసిన వాక్యాలు కావనుకుంటా ..


"రైతు ఆత్మహత్యలు ఆపడమెలా ? " అని
మీరు చెప్పిన సొల్యూషన్ ఏంది మేడం ?

ఆత్మహత్య చేసుకున్న సదరు వ్యక్తి కుటుంబాన్ని ( చెట్టంత మనిషిని ,తన ఇంటి ఆధారాన్ని కోల్పోయిన కుటుంబం మొత్తాన్ని)  తీసుకెళ్ళి  బ్రతుకంటే ఏమిటో, బ్రతకడం ఎలాగో తెలియపరచవలసినదిగా మీరు ఈ గొప్ప ప్రభుత్వాలని కోరుకుంటున్నారు .

మరి రైతు చావులకు చలించని ప్రభుత్వాలు ,దళారులు , గొప్ప గొప్ప మహానేతలు ..
చచ్చిపోయిన రైతుని చూసి జాలిపడక పోగా , రైతు  బతికినా చచ్చినా ఒక్కటే అనీ , బతికి మొరగటం తప్ప ఏమీ చెయ్యని (గంపెడు పిల్లల్ని కనే )  వాడని నిర్ధారించేసిన మనలాంటోల్లని ఎక్కడికి పంపాలమ్మా ?

వైతరణీ నది ఒడ్డుకా ?     


-------------------------------------------------------------------------------------------------------------------------------


మేడం  గారు ,
మీ బ్లాగ్ లో నే కామెంట్ చెయ్యటానికి చాలా ప్రయత్నించాను .
అయితే ఎందుకో కుదరటం లేదు . ఒక టెక్నికల్ ఎర్రర్ వస్తుంది . నాకు సిస్టం నాలెడ్జ్ అంత గా లేదు .
అందువల్ల మీ బ్లాగ్ లో వెయ్యాల్సిన కామెంట్ నా బ్లాగ్ లో పోస్ట్ గా వేసాను .

నా అభిప్రాయాన్ని రాసాను . ఎక్కడైనా నొచ్చుకుంటే మన్నించండి .
పిలిచి పరాభవం చేసినట్టుగా భావించొద్దు అని నా విన్నపం ..
మిమ్మల్ని కించ పరచటం గాని , రైతు ఆత్మ హత్యల్ని సపోర్ట్ చెయ్యటం గానీ నా ఉద్దేశ్యం కాదు . గమనించగలరు .